ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్

 *అమరావతి* : మే రాక ముందే ఎండలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.


ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలెర్ట్‌ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను శుక్రవారం (ఏప్రిల్‌8) 16 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఈ మండలాలన్నీ కడప (5), కర్నూలు (11) జిల్లాల్లోనే ఉండడం గమనార్హం.

ఇక రానున్న 24 గంటల్లో (ఏప్రిల్‌9)న తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని మండలంలో వడగాల్పు్లు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో (ఏప్రిల్‌10)న రాష్ట్రంలోని 6 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం(4), విశాఖపట్నం (1), తూర్పుగోదావరి(1) జిల్లాల్లోని మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

 *వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు* :
విజయనగరం : కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, గురుగుబిల్లి, పార్వతీపురం.
విశాఖపట్నం: గొలుగొండ
తూర్పుగోదావరి: రాజవోమంగి.